
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన చూస్తుంటే... మనం భారతదేశంలో ఉన్నామా?, వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ పాలన ఆశాజనకంగా లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి లేదన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి రెవెన్యూ లోటు ఉందంటూ పదే పదే చెబుతూ మరోవైపు వేలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నామని నాలుగేళ్లు నుంచి చెబుతున్నారని, తాము ఏం చెప్పినా నడుస్తుందనే భావనలో ఇక్కడ ప్రభుత్వం ఉందని తలసాని విమర్శించారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు సందర్భంగా ఏపీ సర్కార్ ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారని తలసాని విమర్శించారు.
ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు..
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అని అన్నారు. ప్రజాస్వామ దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చని తలసాని పేర్కొన్నారు. గతంలో తాను ఏపీకి వచ్చి వెళ్లాక మావాళ్లను వేధించారని ఆయన అన్నారు. హైదరాబాద్కు కూడా చాలమంది మంత్రులు వస్తారని, వారిని పోలీసులు ఎందుకు వచ్చారని అడగరని అన్నారు. హాయ్ల్యాండ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటే ఇంటెలిజెన్స్ నుంచి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా హాయ్ ల్యాండ్ లో బస చేస్తున్నానని హాయ్ ల్యాండ్ యాజమాన్యంను కూడా పోలీసులు బెదిరించారన్నారు. తాను ప్రెస్మీట్ పెట్టిన హోటల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి చేశారని, ఏపీలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని అన్నారు.
ఏపీని సింగపూర్ చేస్తానని అంటూ, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తలసాని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ని నేనే కట్టినని చెప్పే చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను ఎందుకు కట్టలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై హోదా కోసం పోరాటం అంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు బీసీలను తొక్కేశారు..
చంద్రబాబు బీసీలను అన్నివిధాలుగా తొక్కేశారని, అందుకే యాదవులు, బీసీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పెడుతున్న పప్పు బెల్లాలు ఎన్నికల వరకే పరిమితమని అన్నారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, ఇప్పుడు అదే పార్టీని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పెట్టారన్నారు. రాష్ట్రంలో బీసీలను కదిలిస్తామని...ఈ సందర్భవంగా గుంటూరులో యాదవ, బీసీ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని తెలిపారు.
కాపులను మోసం చేసేందుకే...
పాడి పరిశ్రమ మీద నిర్లక్ష్యం చూపుతున్నారని, కేంద్రం పాడి పరిశ్రమ అభివృద్ధికి కౌంటర్ గ్యారెంటీ అడిగితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు ...హెరిటేజ్ ఎలా లాభాల్లో ఉందో పాడి రైతులకు కూడా వివరించాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణలో అభివృద్ధిలో రియాలిటీ ఉందని, సీఎం కేసీఆర్ 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, అదే ఏపీలో రైతులకు సరైన విధంగా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. రైతులకు ఇస్తామని చెప్పిన పదివేల రూపాయల పై కూడా ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ను కూడా ఏపీ సర్కార్ పక్కదోవ పట్టించిందని, కేంద్రం కూడా దీనిపై గైడ్ లైన్స్ ఇవ్వలేదని తెలిపారు. కానీ చంద్రబాబు సర్కార్ ...కాపులను మోసం చేసేందుకు దీనిలో 5 శాతం రిజర్వేషన్ కేటాయించినట్లు ప్రకటించిందన్నారు. ఇక పసుపు-కుంకుమ బోగస్ అని తలసాని తేల్చేశారు.