
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్ మేనేజ్మెంట్లతో కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ఆదిశేషగిరిరావు బుధవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా, గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని, వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటూ నెపం నెడుతున్నారన్నారు.
టీడీపీ లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేది కాదని ఆదిశేషగిరిరావు అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్ ఉన్నా...కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ..ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ తన గొప్పేనని గతంలో చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు బీజేపీపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ డీజీపీ నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు.