
నా తొలి ప్రాధాన్యత అదే: ఏబీ
న్యూఢిల్లీ: తాను జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో ఏ ఒక్క మ్యాచ్ ను వదులుకోవడానికి ఇష్టపడనని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే పలు మ్యాచ్ లను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన డివిలియర్స్ దానిపై తాజాగా స్పందించాడు.
'నా తొలి ప్రాధాన్యత జాతీయ జట్టుకే.ఐపీఎల్లో పలు మ్యాచ్ లను మిస్సయి ఉండవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా తరపున ఒక గేమ్ కూడా మిస్ కావడానికి నా దగ్గర ప్రణాళికలు లేవు. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎప్పుడూ వదులుకోను. నా ఫామ్ పై ఎటువంటి ఆందోళన లేదు. మీరు ఆశించినా, ఆశించకపోయినా నా ఫామ్ పై బెంగ లేదు. కొన్ని మంచి షాట్లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తే, ఫామ్ ను అందుకోవడం కష్టం కాదు. నేను సెంచరీ చేయకపోయినప్పటికీ, బంతిని హిట్ చేయడంలో నాది ఎప్పుడు ఒకటే పద్ధతి'అని డివిలియర్స్ పేర్కొన్నాడు.