Published
Wed, Jan 14 2015 1:06 AM
| Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్కు ఈ నెల 24న ఐసీసీ పరీక్ష నిర్వహించనుంది. చెన్నైలోని బయోమెకానిక్ పరీక్ష కేంద్రంలో దీనిని నిర్వహిస్తారు. గత సెప్టెంబరులో అజ్మల్పై ఐసీసీ నిషేధం విధించింది. ఆ తర్వాత తన బౌలింగ్ శైలిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసిన ఈ పాక్ స్పిన్నర్ పలుమార్లు అనధికార టెస్టుల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు తన బౌలింగ్ శైలి నిబంధనలకు అనుగుణంగా ఉందని పాక్ బోర్డుకు చెప్పడంతో... అధికారిక పరీక్ష నిర్వహించమని కోరారు.
దీంతో చెన్నైలోని సెంటర్కు జనవరి 24 వెళ్లాలని ఐసీసీ తెలిపింది. ఒకవేళ ఈ పరీక్షలో గనక అజ్మల్ విఫలమైతే... ఏడాది పాటు మరోసారి ఐసీసీ పరీక్ష నిర్వహించదు. అంటే అజ్మల్ మరో ఏడాది పాటు క్రికెట్కు దూరం కావలసి ఉంటుంది. పరీక్ష కోసం బ్రిస్బేన్లోని సెంటర్కు వెళ్తానని అజ్మల్ కోరినా... ఐసీసీ మాత్రం చెన్నై వెళ్లాలని సూచించింది. ప్రపంచకప్కు పాకిస్తాన్ జట్టులో అజ్మల్కు స్థానం దక్కలేదు.