
హైదరాబాద్: వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించి తనదైన ముద్ర వేసిన టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వైట్బాల్ గేమ్పై మాత్రమే దృష్టి పెట్టదల్చుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ కెరీర్కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు లేఖ రాశాడు. ‘ నేను హైదరాబాద్కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడతాను’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.
అంబటి రాయుడు ఆకస్మిక నిర్ణయంతో టెస్టు ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పినట్లయ్యింది. గురువారం నుంచి రంజీ ట్రోఫీ ఆరంభమైన తరుణంలో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కల్గించింది. 2013-14 సీజన్లో భాంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు రాయుడు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత టెస్టుల్లో చోటు సంపాదించలేకపోయాడు. దాంతో తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా రాయుడు ఆడలేదు. కాగా, వన్డేల్లో కూడా నిలకడలేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రాయుడు.. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాయుడు నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి కోహ్లి నుంచి కూడా భరోసా దొరికింది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్పైనే ఫోకస్ చేయదలుచుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment