
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. ఏషియన్ క్రీడల్లో భాగంగా నాలుగో రోజు వుషు సాండా విభాగంలోనే భారత ఆటగాళ్లు నాలుగు పతకాలు సాధించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో మహిళల వుషు సాండా 60 కేజీల విభాగంలో రోష్బినా దేవి కాంస్య పతకం గెలుచుకున్నారు. పురుషుల సాండా 56 కేజీల విభాగంలో సంతోష్ కుమార్ కాంస్య పతకం గెలుపొందారు. ఇదే ఈవెంట్లో 60 కేజీల విభాగంలో సూర్య భాను ప్రతాప్ సింగ్ సెమీఫైనల్లో ఆఫ్గనిస్తాన్ ఆటగాడు ఇర్ఫాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సాండా 65 కేజీల విభాగంలో నరేంద్ర కూడా కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
ఇక సెపక్తక్రాలో భారత్ తొలి పతకం సాధించింది. థాయ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో 0-2తో భారత జట్టు ఓటమి చవిచూసింది. 1990 ఏషియాడ్లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్కు పతకం దక్కలేదు. మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో షూటర్ రహీ జీవన్ సర్నోబత్ పసిడి గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యపతకాలు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment