
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-శ్రీలంకల మధ్య డిసెంబర్10 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్కు సంబంధించి తొలి రెండు వన్డేల సమయాన్ని బీసీసీఐ సవరించింది. చలి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధర్మశాల, మొహాలీలో జరిగే వన్డేల సమయాన్ని మార్చినట్లు ప్రకటించింది. తొలి రెండు వన్డేలూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని తెలిపింది.
‘హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్పీసీఏ), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు సవరించిన సమయం ప్రకారం డిసెంబర్ 10న ధర్మశాలలో తొలి వన్డే, డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే జరుగుతాయి’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనుంది.