
హైదరాబాద్ : టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాలు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలిసారి కలిసి బరిలోకి దిగనున్నారు. దీనికి న్యూజిలాండ్తో జరిగే మూడు టీ20ల సిరీస్ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ల్లో పాండ్యా బద్రర్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగేతే పాండ్యా బ్రదర్స్.. అమర్నాథ్ బ్రదర్స్, పఠాన్ బ్రదర్స్ల సరసన చేరనున్నారు. భారత్ తరఫున తొలి టెస్ట్ సెంచరీ సాధించిన లాల్ అమర్నాథ్ కుమారులైన మహిందర్ అమర్ నాథ్, సురీంధర్ అమర్ నాథ్లు భారత్ తరపున బ్రదర్స్గా తొలిసారి బరిలోకి దిగారు. అనంతరం ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు భారత్కు ప్రాతినిధ్యం వహించి ఈ జాబితాలో చేరారు. పఠాన్ బ్రదర్స్ ఎన్నో కీలక మ్యాచ్ల్లో అదరగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాలందించారు. ఇందులో 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 59 పరుగుల భాగస్వామ్యంతో అందించిన విజయం హైలెట్. కాకతాళీయమో కానీ బరోడాకే చెందిన పాండ్యా బ్రదర్స్ ఇప్పుడు భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు.
అయితే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగానే ఈ ఆల్రౌండర్ బ్రదర్స్ కలిసి బరిలో దిగాల్సి ఉండగా.. కృనాల్కు తుది జట్టులో అవకాశం లభించలేదు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ జరిగిన మ్యాచ్ ద్వారా కృనాల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. అయితే ఆ సమయంలో పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇప్పటి వరకు వీరు కలిసి బరిలోకి దిగే అవకాశం రాలేదు. కివీస్తోనైనా కలిసి బరిలోకి దిగుతారా లేదో వేచి చూడాల్సిందే. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా బ్రదర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment