హైదరాబాద్ విజయం | Hyderabad victory | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ విజయం

Published Tue, Dec 1 2015 3:05 AM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM

హైదరాబాద్  విజయం - Sakshi

సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో చెన్నై వారియర్స్‌పై హైదరాబాద్ ఏసెస్ ఆధిపత్యం కొనసాగింది. చెన్నైలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తు చేసిన ఏసెస్ రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. సోమవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 5-3, 5-2, 5-4, 5-4, 5-6 (25-19 గేమ్‌ల)తో చెన్నైని చిత్తు చేసింది. ఆదివారం నాగ్‌పూర్ ఆరెంజర్స్ చేతిలో పరాజయం పాలైన ఏసెస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు.

ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో థామస్ జొహన్సన్ 5-3తో రైనర్ షట్లర్‌ను ఓడించి జట్టుకు ఆధిక్యం అందించాడు. మహిళల సింగిల్స్‌లో మార్టినా హింగిస్ 5-2 తో హీతర్ వాట్సన్‌ను చిత్తు చేసి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి కార్లోవిచ్-హింగిస్ 5-4తో చెన్నై జంట వెర్డాస్కో-వాట్సన్‌ను ఓడించింది.

పురుషుల డబుల్స్‌లో ఏసెస్ ద్వయం కార్లోవిచ్-జీవన్ 5-4తో వెర్డాస్కో-విష్ణువర్ధన్‌లపై గెలవగా... చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో మాత్రం వారియర్స్ ప్లేయర్ వెర్డాస్కో 6-5తో కార్లోవిచ్‌ను ఓడించి ప్రత్యర్థి ఏకపక్ష విజయాన్ని అడ్డుకున్నాడు. శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్, ఆరెంజర్స్‌తో రెండోసారి తలపడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement