
టి20ల్లో ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
రాజ్కోట్: టి20ల్లో టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. పొట్టి ఫార్మాట్ ఛేజింగ్లో భారత జట్టుకు ఇది 41వ విజయం కావడం విశేషం. 61వ సార్లు టీమిండియా ఛేజింగ్కు దిగగా 41 పర్యాయాలు విజయాల్ని అందుకుంది. 40 విజయాలతో ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే ఆసీస్ 69 సార్లు సెకండ్ బ్యాటింగ్ దిగి 40 సార్లు గెలిచింది. అంటే ఆస్ట్రేలియా కంటే తక్కువ మ్యాచ్ల్లోనే టీమిండియా ఛేజింగ్ రికార్డును చేజిక్కించుకుంది.
రోహిత్.. రికార్డులే రికార్డులు
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పలు రికార్డులు బ్రేక్ చేశాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(37) సాధించిన కెప్టెన్గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(34) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 62 ఇన్నింగ్స్లో ఈ రికార్డు సాధించగా, రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 26 ఇన్నింగ్స్లో 26 సిక్సర్లతో విరాట్ కోహ్లి వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. 22వ అర్ధసెంచరీతో విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. కెప్టెన్గా వీరిరువురూ ఆరు అర్థసెంచరీలు సాధించడం విశేషం.
టి20ల్లో వంద కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా శిఖర్ ధావన్తో కలిసి రోహిత్ శర్మ తన పేరిట లఖించుకున్నాడు. గతంలో కోహ్లితో కలిసి మూడు సార్లు వంద ప్లస్ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ‘హిట్మాన్’ తాజాగా శిఖర్ ధావన్తో కలిసి ఈ ఫీట్ను పునరావృతం చేశాడు. రాజ్కోట్ మ్యాచ్లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. (చదవండి: రోహిత్ తుఫాన్: రెండో టి20లో భారత్ జయభేరి)