చరిత్రకు చేరువలో... | Indian team in World Archery Championship Final | Sakshi
Sakshi News home page

చరిత్రకు చేరువలో...

Oct 21 2017 1:59 AM | Updated on Oct 21 2017 1:59 AM

Indian team in World Archery Championship Final

మెక్సికో సిటీ: ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏనాడూ భారత్‌కు స్వర్ణ పతకం రాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు ఆ లోటు తీరే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, త్రిషా దేబ్‌ (బెంగాల్‌), లిలీ చాను పోనమ్‌ (మణిపూర్‌)లతో కూడిన భారత బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది.

సెమీఫైనల్లో టీమిండియా 232–227తో జర్మనీని ఓడించగా... క్వార్టర్‌ ఫైనల్లో 233–228తో డెన్మార్క్‌పై, తొలి రౌండ్‌లో 232–229తో రష్యాపై గెలిచింది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన భారత్‌ ఈసారి మాత్రం నిలకడగా ఆడుతూ పసిడి పతక పోరుకు అర్హత పొందడం విశేషం. కొలంబియా జట్టుతో  శనివారం జరిగే ఫైనల్లో భారత్‌ గెలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తుంది. 

ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు నాలుగు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, లిలీ చాను ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోగా... త్రిషా మూడో రౌండ్‌లో పరాజయం పాలైంది.మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురేఖ–అభిషేక్‌ జంట తొలి రౌండ్‌లో 151–154తో సాన్‌ డి లాట్‌–మైక్‌ ష్కాల్సర్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement