నాకౌట్‌కు బరోడా, ఢిల్లీ | Kerala, Delhi and Baroda qualify for Super League | Sakshi
Sakshi News home page

నాకౌట్‌కు బరోడా, ఢిల్లీ

Jan 10 2016 2:39 AM | Updated on Sep 3 2017 3:23 PM

సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్ ‘సి’ నుంచి బరోడా, ఢిల్లీ జట్లు నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.......

►  ఆంధ్రకు మరో ఓటమి
►  ముస్తాక్ అలీ టి20 టోర్నీ

 
 వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్ ‘సి’ నుంచి బరోడా, ఢిల్లీ జట్లు నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. లీగ్‌లో ఐదేసి మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లూ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 20 పాయింట్ల చొప్పున సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు ఆంధ్రపై మూడు వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ భరత్ (30) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.

బౌలర్ అయ్యప్ప (24) చివర్లో పోరాడటంతో ఆంధ్రకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. బరోడా బౌలర్లలో పాండ్య, ఆరోధ్, భట్ రెండేసి వికెట్లు తీశారు. బరోడా జట్టు 16.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 93 పరుగులు చేసి నెగ్గింది. 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా ఇర్ఫాన్ పఠాన్ (28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 2 పరుగులతో గోవాపై గెలిచింది. తొలుత ఢిల్లీ 91 పరుగులకు ఆలౌట్ కాగా... గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది.

 ఇదే టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి కేరళ 20 పాయింట్లతో నాకౌట్ స్థానాన్ని ఖరారు చేసుకోగా... జార్ఖండ్ 16 పాయింట్లతో ఉంది. సౌరాష్ట్ర, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ మూడింటిలో ఒక జట్టు కేరళతో పాటు నాకౌట్‌కు చేరుతుంది. అందరికీ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ 16 పాయింట్లతో దాదాపుగా నాకౌట్ బెర్త్ సాధించింది. తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 12 పాయింట్లతో ఉన్నాయి. అన్ని జట్లకూ ఒక్కో మ్యాచ్ మిగిలుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement