
మహ్మద్ షమీ (ఫైల్)
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. డెహ్రడూన్లో చికిత్స తీసుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడని సన్నిహితులు వెల్లడించారు. షమీ సురక్షితంగా ఉన్నాడని, అతడి తలకు కుట్లుపడ్డాయని తెలిపారు. షమీ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేయడంతో వ్యక్తిగత జీవితంలో షమీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తన భర్త స్త్రీలోలుడని, క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని షమీపై ఆరోపణలు చేసింది. తనను చిత్రహింసలు పెట్టాడని, హత్యాయత్నం కూడా చేశాడని వెల్లడించింది. అయితే జహాన్ ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మొదట బీసీసీఐ కూడా కాంట్రాక్ట్ ఇవ్వవపోవడంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కాంట్రాక్టును బీసీసీఐ తర్వాత పునరుద్ధరించడంతో అతడికి ఊరట లభించింది.