
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సత్తా చాటారు. కోహ్లి తన నెం.1 ర్యాంకు నిలబెట్టుకోగా రోహిత్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదు ర్యాంకు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ 59.20 సగటుతో 296 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. భారత్-ఆస్ట్రేలియా సిరీస్లలో టాప్స్కోరు నిలవడం రోహిత్కు ఇది వరుసగా మూడో సారి. ఈ ప్రదర్శనతో రోహిత్ 794 పాయింట్ల సాధించి పాక్ ప్లేయర్ బాబర్ అజమ్(786) వెనక్కు నెట్టి ఐదో ర్యాంకు సాధించాడు. కెప్టెన్ కోహ్లి(877) పాయింట్లతో తన ర్యాంకు సుస్థిరం చేసుకోగా.. ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్(865), దక్షిణాఫ్రికా ప్లేయర్ డివిలియర్స్ (847) , ఇంగ్లండ్ జోరూట్(802) ముందు వరుసలో ఉన్నారు.
ఇక బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి ఐదో స్థానంలో నిలవగా.. యువస్పిన్నర్ అక్సర్ పటేల్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమ ఏడో ర్యాంకు సాధించాడు. ఆల్రౌండర్లలో టాప్-5 లో భారత ఆటగాళ్లలో ఎవరికి చోటుదక్కలేదు. ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో 7 వికెట్లతో విజయం సాధించి 4-1 సిరీస్తోపాటు వన్డేల్లో భారత్ నెం.1 ర్యాంకు పదిలం చేసుకున్న విషయం తెలిసిందే.