
కోహ్లి మళ్లీ ఇరగదీశాడు!
బెంగళూరు: మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇరగదీశాడు. ఐపీఎల్-9లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ (79;48 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. మరోవైపు ఏబీ డివిలియర్స్(55;33 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో రాయల్ చాలెంజర్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరుణంలో విరాట్ కు జత కలిసిన ఏబీ రెచ్చిపోయాడు. ఒకవైపు విరాట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళుతుంటే, ఏబీ మాత్రం తన సహజసిద్ధమైన ఆటతో ధాటిగా ఆడాడు. ఏబీ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసి ఢిల్లీ బౌలర్లు గుండెల్లో దడ పుట్టించాడు. ఈ క్రమంలోనే బెంగళూరు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు సాధించింది. అయితే హాఫ్ సెంచరీకి మరో ఐదు పరుగులు మాత్రమే జోడించిన అనంతరం బ్రాత్ వైట్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు.
ఆ తరువాత షేన్ వాట్సన్(33;19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఒకానొక దశలో బెంగళూరు 200 పైగా స్కోరు నమోదు చేస్తుందని భావించినా.. వాట్సన్, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులకు మాత్రమే చేయకల్గింది.ఢిల్లీ బౌలర్లో మహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో విరాట్(75;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి బెంగళూరు విజయలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.