భారత్కు తొలి పతకం
రియో డి జనీరో: ఎట్టకేలకు రియో ఒలింపిక్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్కు చేరుకోవడంతో భారత రెజ్లర్కు ‘రెప్చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సాక్షి.. భారత్ అభిమానుల పతక నిరీక్షణకు తెరదించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా విజయ బావుటా ఎగురేసి బ్రెజిల్ వీధుల్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది.