
రన్నరప్ సానియా జంట
న్యూఢిల్లీ : రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట రన్నరప్గా నిలిచింది. రోమ్లో ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 4-6, 3-6తో మూడో సీడ్ తిమి బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సానియా జంట తుదిపోరులో మాత్రం వరుస సెట్లలో ఓడింది.
72 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జోడీ తమ సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయింది. రన్నరప్గా నిలిచిన సానియా-హింగిస్లకు 57,840 యూరోల ప్రైజ్మనీ (రూ. 42 లక్షలు)తోపాటు 585 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జతగా ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంటకు ఫైనల్లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. తొలి మూడు టోర్నమెంట్లలో (ఇండియన్ వెల్స్, మియామి, ఫ్యామిలీ సర్కిల్ కప్) విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం పోర్షె గ్రాండ్ప్రిలో రెండో రౌండ్లో, మాడ్రిడ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.