
చెన్నై: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టైటిల్ సాధించాడు. అమెరికాలో జరిగిన మాడిసన్ ఓపెన్లో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన ఈ ఆసియా జూనియర్ చాంపియన్ సంచలన విజయాలతో కడదాకా దూసుకెళ్లాడు. ఫైనల్లో 20 ఏళ్ల సెంథిల్ 7–11, 13–11, 12–10, 11–4తో నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్ (దక్షిణాఫ్రికా)ను కంగుతినిపించాడు.
మాజీ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ విజేత అయిన సెంథిల్ మొదటి రౌండ్లో మూడో సీడ్ బెర్నట్ జుమే (స్పెయిన్)కు షాకిచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మార్క్ ఫుల్లర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. ప్రపంచ 255 ర్యాంకర్ అయిన ఈ భారత ఆటగాడు గతంలో రెండుసార్లు పీఎస్ఏ ఈవెంట్లలో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచాడు. ఈ సారి మాత్రం టైటిల్ సాధించేదాకా విశ్రమించలేదు.