మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదోన్నతులతో సహా నగదు ప్రోత్సాహకాలిస్తామని, భారత్ జట్టు ఫైనల్లో గెలువాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్( ఆర్ఎస్పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్ మీడియాకు తెలిపారు.
మిథాలీ సేనలోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్లు రైల్వే ఉద్యోగులే. వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత్ ఫైనల్కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది.
మిథాలీ నిలకడగా ఆడుతూ వన్డెల్లో ప్రపంచ రికార్డు నమోదు చేయగా, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్లో ఆస్ట్రేలియా పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. రాజేశ్వరి గైక్వాడ్, ఎక్తా బిష్త్ బౌలింగ్తో చెలరేగగా, వేద కృష్ణమూర్తి న్యూజిలాండ్తో మెరుపు బ్యాటింగ్ చేసింది.