
అన్షుమన్ గైక్వాడ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగే సూచనలు కనిపించడం లేదని, భారత్లో పరిస్థితులు సర్దుకుంటే దాని స్థానంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, భారత జట్టు మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా నెలకొన్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు క్రికెటర్లు మానసిక స్థయిర్యాన్ని కూడగట్టుకోవాలని ఆయన సూచించారు. ‘ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరుగనుంది.
ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి ఆలోచించకూడదుగానీ, భారత్లో పరిస్థితి అనుకూలిస్తే లీగ్ నిర్వహణకు ప్రపంచకప్ జరిగే అక్టోబర్–నవంబర్ నెలలే అనుకూలమైన సమయం. ఒకవేళ వరల్డ్ కప్ రద్దు లేదా వాయిదా పడితేనే లీగ్ జరిగే అవకాశముంది. అది కూడా భారత్లో వాతావరణం అనుకూలిస్తేనే. కరోనా తగ్గాక క్రికెట్ మునుపటిలా ఉండబోదు. ప్రేక్షకులు లేకుండానే ఆడేందుకు క్రికెటర్లు అలవాటు పడాలి. మైదానంలో ముందులా సత్తా చాటాలంటే ఆటగాళ్లు మానసిక స్థయిర్యాన్ని పెంపొందించుకోవాలి’ అని అన్షుమన్ పేర్కొన్నారు.