
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో యూఏఈ 82 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేదు. అన్వర్ తరువాత రోహన్ ముస్తఫా(11)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 81 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్కు రెండు వికెట్లు లభించగా, బూమ్రా, పాండ్యా,హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్లకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా, చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు.
వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్కు చేరగా, మూడు మ్యాచ్లు ఓడిన యూఏఈ నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కాగా, భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం.