
పారా అథ్లెటిక్స్లో మెరిసిన వేణు
జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వేణు, సృజన్ సత్తాచాటుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వేణు, సృజన్ సత్తాచాటుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో ఏపీ పారా అథ్లెట్లు రెండు పతకాలు గెలుపొందారు. ప్రకాశం జిల్లాకు చెందిన వినుకోటి వేణు బంగారు పతకం సాధించాడు.
సిట్టింగ్ కేటగిరీ ఎఫ్-56 డిస్కస్ త్రో ఈవెంట్లో అతను విజేతగా నిలువగా... కృష్ణా జిల్లాకు చెందిన వేసంగి సృజన్ కాంస్యం గెలుపొందాడు. టి-46 కేటగిరీ 1500 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన సృజన్ మూడో స్థానంలో నిలిచాడు. తమ క్రీడాకారుల విజయం పట్ల ఏపీ పారాలింపిక్ సంఘం అధ్యక్షుడు బి. రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చాంపియన్షిప్లో 20 మంది సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ జట్టు పోటీపడింది.