
‘ఒకరోజు నలుపు తెలుపు ప్రేమలో పడింది. కానీ ఈ తెలుపు ఆ నలుపుని తనూ ‘తెలుపు’ అయి రమ్మని, అలా మారితేనే ప్రేమిస్తానంటుంది. పాపం ‘నలుపు’! తను తెలుపుగా మారటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. పాల మీగడలు పాత్రలకొద్దీ తింటాడు. ఆకాశాన తెలతెల్లని మబ్బుతరగలపై రోజూ పొర్లుతాడు. సాగర కెరటాల నురగలపై స్నానాలు చేస్తాడు. ధవళ వస్త్రాలెన్నో చుట్టుకుంటాడు. తెల్లని పూలమాలలు లక్షలాదిగా ధరిస్తాడు. హంసలు, పావురాలు వంటి ఎన్నో తెలుపు రంగు పిట్టల రెక్కలను ఎరువు తెచ్చుకుని; ఎగురుతూ, దుముకుతూ క్షీరసాగరాలలో మునకలేస్తాడు. గుడులూ గోపురాలపైన వెలిగే శ్వేతకాంతుల దివ్వెల వెలుగులను తనలోకి స్వీకరిస్తాడు. నింగిచుక్కల తళుకులు తెచ్చుకుని దేహమంతా పులుముకుంటాడు. హేమంత వేళల హిమాద్రుల మంచుమంచెలపై ఎన్నో రాత్రులు శయనిస్తాడు. ఇన్ని చేసినా తీరా నలుపు– తెలుపును సమీపించిన ప్రతిసారీ నలుపుగానే ఉంటున్నాడు.
‘ఎప్పటికైనా నలుపు నలుపే గదా!’ అని దుఃఖిస్తున్నాడు. అలా వేల వసంతాలు వృథా అయిపోవలసిందేనా అని నలుపు ఎంతో బెంగపెట్టుకున్నాడు. చివరికి ఓ క్షణంలో జాలిపడిన తెలుపు నలుపుని దగ్గరకు తీసుకుంటుంది. ఒకే ఒక బిగి కౌగిలి! అంతే! ఆ రాత్రి నక్షత్రాలు నీలాకాశంతో ‘రహస్యంగా’ రమించాయట! నలుపు ప్రాణులన్నీ తెలుపు ప్రాణులను పెనవేసుకున్నాయి. రేయీ పగలూ కలిసి ఒకే మధుపాత్ర నుండి రతిఫలరసాలు తప్పతాగాయి. cవెలుగుల స్పర్శతో ఆ క్షణాన చీకటి ఛాయలన్నీ తీయని స్ఖలనాలు పొందాయట!
ఉదయం విరిసింది. వేకువనే లేచి, తెల్లని ఉల్కలను రాలుస్తున్న తన పైటకొంగును సర్దుకుని లేచి వెళ్ళిపోబోతున్న ‘తెలుపు’ చేతిని గట్టిగా పట్టుకుని లాగి ‘అదేంటి? నన్నెందుకు విడిచి పోతున్నావు?’ అని నిలదీస్తాడు నలుపు. అతని బేలతనం చూసి నవ్వుకున్న తెలుపు ‘ఈ లోకం ఏనాడో అనాదిగా నలుపు– తెలుపులుగా విడిపోయిందోయ్! ఎప్పుడైనా, ఎక్కడైనా వాటి మధ్య ఉండే పలుచని విభజన రేఖలు ఒకవేళ ఎవరైనా శాశ్వతంగా చెరపగలిగితేనే, చీకటి వెలుగుల సంగమాల సంజెపొద్దుల్లోనే మనకు శాశ్వత కలయిక సాధ్యం! అప్పటివరకు సెలవా మరీ!’ అంటూ శ్వేత వలయాలుగా పైకి లేచి పరిసరంలోని ప్రతి తెల్లని జీవ నిర్జీవ పదార్థాలలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది తెలుపు!
నలుపు ఎంతో నిస్పృహతో తన కన్నతల్లి అయిన నిశీధి ఒడిలో తలవాల్చి పడుకొని విశ్వంలో కృష్ణబిలాలకు ప్రభాత వేలుగురేఖల కుంచెలతో తెలుపు రంగులద్దుతున్నట్లుగా తెల్లవారు ఝామున కలలు కంటూ ఇంకా తన ప్రేయసి ‘తెలుపు’ తలపులలోనే బతుకెళ్ళదీస్తున్నాడు. యుగాల నిరీక్షణ అది. అయినా నలుపు నలుపే, తెలుపు తెలుపే గదా! వాటి సంగమం అసాధ్యం. సాధ్యమైనా అది క్షణ భంగురమే కదా!’
‘ఇప్పుడది ఎందుకే అంత పెద్దగా చదువుతున్నావు?’
‘మొత్తం మీద భలే లౌక్యంగా రాశావే మామ్మా, సో క్రాఫ్టీ!’
‘తమరి పొగడ్తలేం నాకవసరం లేదులే!’
‘సర్లేవే! ఇంతకీ ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన మహానుభావులెవరో? గట్టిగానే లాబీయింగ్ చేసినట్టున్నావు. మూడొందల పేజీల ముచ్చటైన అబద్ధాలు– అబ్బో! ‘కాల–శ్వేత సంగమం’ అంటూ తమరి ఈ మహావచన కావ్యానికి ఆ టైటిలొకటి! అంతా వొట్టిదే!’’
‘నోర్ముయ్! వొట్టిదో గట్టిదో మరి నువ్వూ ఇలా రాయవే చేతనైతే!’
‘రాస్తాను.. రాస్తాను.. కానీ ఇలా కాదు!’
‘అబ్బో! మరెలా?’
‘నే రాస్తే నీలా కాదులే, రాసిందే జీవిస్తా! జీవించేదే రాస్తా!’
‘రాసేది అంతా చూసేదేనే ఫూల్! చేసేది కాదు!’
‘ఏం? చేసేది రాస్తే? ఒకట్రెండు పుస్తకాల్లోనైనా తమరు చేసింది రాస్తే బాగుండేది!’
‘గమ్మునుండవే పిల్లా! భయమెరుగని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!’
‘నువ్వే గమ్మునుండవే! వృద్ధనారీ పతివ్రతా! నాకూ వచ్చు సామెతలు’
‘ఎంతగా బరితెగిస్తున్నారే మీ తరం!’
‘మీ తరాలేమన్నా తక్కువ తిన్నారా ఏంటి?’
‘ఏం తెలుసే మా గురించి నీకు కోణంగిదానా?’
‘క్లబ్బులూ పబ్బులూ చాలా ఉండేవిగా మీ అభ్యుదయ రైటర్స్ గ్యాంగులకు! ఏ అర్ధరాత్రో, అపరాత్రో గూళ్ళకు చేరుకునేవాళ్ళటగా!’
‘ఏయ్.. నోర్మూయ్!’
‘హేయ్.. నువ్వే మూసుకో!’
‘నువ్వా కులం తక్కువోడితో కులికొచ్చినట్లు కాదులే!’
‘ఐతే కులం ఎక్కువైనోళ్లతో గెలుక్కోవచ్చన్న మాట– మీలా!’
పొగలు సెగలు కక్కుతూ బామ్మ చెప్పు తీసుకొని కొట్టటానికన్నట్లు చేయి పైకి లేపింది. మనుమరాలు వేగంగా కదిలి, బామ్మ చేతినలాగే ఒడిసి పట్టుకొని ఆమెను విసురుగా నెట్టేసింది. గోడకు కొబ్బరికాయలా తగిలిన బామ్మ తల పగిలి కిందికి జారుతూ ఉంటే ఆ గోడపై సన్నగా, బారుగా ఓ నెత్తురు చిత్తరువును అద్దినట్లయింది. అన్ ఫోర్స్డ్ ఎర్రర్ అయినా, ఆవేశపు అనర్థం అనుకున్నా, మొత్తం మీద జరిగింది వర్ధమాన రచయిత్రి చేతిలో వెటరన్ కవయిత్రి దుర్మరణం.
‘బ్రేకింగ్ న్యూస్’
‘ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, మూడుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తీసుకున్న శ్రీమతి సత్యవేణమ్మ హత్య. ఆవేశపరురాలైన ఆమె మనవరాలు విశ్వంభరనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అయితే, ఇంట్లో వాళ్లు తన కులాంతర ప్రేమ వివాహానికి అంగీకరించక హింసించటం వల్లనే అసలిదంతా ఒక్క క్షణంలో ఆవేశకావేశాలు కమ్మి జరిగిపోయిందని హత్యకు పాల్పడ్డ మనవరాలు చెబుతోంది. అతి ఆవేశపరురాలు అయిన ఆ మనవరాలిని సత్యవేణమ్మగారి గదిలో కాకుండా వేరే గదిలో నిర్బంధించి వున్నట్లయితే మహారచయిత్రి ప్రాణాలు నిలిచి ఉండేవని పోలీసులు, నేర నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నారు.
మన దేశంలో యువతలో ముఖ్యంగా యువతుల్లో నానాటికీ చెలరేగుతున్న హింసా ప్రవృత్తిని చర్చించటానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు జాయినవుతున్నారు ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు, గొప్ప మహిళా అభ్యుదయవాది, మహావక్త శ్రీమతి మౌనమ్మగారు, అలాగే నేషనల్ మెన్స్ రైట్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ శ్రీ వాగేశ్వర్రావుగారు. చర్చకు ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్!చాలారోజులపాటు ఆ ఒక్క వార్త నాన్–వెజ్ చానళ్ళ నోటికి నల్లిబొక్కలా, వెజిటేరియన్ చానళ్ళకు ఆవకాయ ముద్దల్లా రుచిగా నలిగింది.
∙∙
‘ఒకరోజు తెలుపు నలుపుని ప్రేమిస్తుంది. నలుపు కూడా తెలుపుని ఇష్టపడతాడు. నలుపు తామిద్దరం కలవటం లోకానికి ఇష్టముండదని, ఒకవేళ కలిసినా లోకం సహించలేక తమను అంతం చేస్తుందని, అందుకే నలుపు తన ప్రియురాలు తెలుపుని తనలా ‘నలుపు’గా రూపాంతరం చెంది తిరిగి రమ్మని కోరుకుంటాడు.పాపం ఆ తెలుపు తాను నలుపు కావటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతిలోని కాటుక వర్ణాలన్నీ సేవిస్తుంది. అగ్గిని తొక్కుతుంది. బుగ్గిని బుక్కుతుంది. నిశరాత్రుల గుండెల్లోని తమస్సునంతా తాగుతుంది. కారు మేఘాలను, కాకులూ కోయిలల రెక్కలను ఎరువు తెచ్చుకుని ఎగురుతుంది. నీలి సంద్రపు గర్భాల అంధకారపు నీడలతో తానమాడుతుంది. కృష్ణపక్షపు నీలిమనంతా గంధలేపనాలుగా పులుముకుంటుంది. పాతాళపు ఛాయలు భుజిస్తుంది.
ధైర్యం చేసి ఓ అడుగు ముందుకెళ్ళి భీకర రక్తమాంసాలు పారే వైతరణీ నదిలో యమకింకరుల చేతుల్లో గాలాలకు దొరికిన చేపల్లా వేలాడుతూ, భీకర ఘోషల ప్రతిధ్వనులతో నిండిన శాపగ్రస్థులైన వారి ఆత్మల్లో దాగి ఉన్న పశ్చాత్తాపపు చీకటిని సేవించి, పున్నమి జోత్స్నల వెన్నెల రేఖ ఒక్కటి కూడా తనపై పడకుండా జాగ్రత్తగా ఆకాశ వీథులు దాటి బయలుదేరింది. అలా తెలుపు తాను నలుపు రంగు ముగ్ధమనోహరియై సందెపొద్దుల్లో తన ప్రియుని బిగికౌగిళ్లలో కరిగిపోవాలని ఆశగా ఎగిరొస్తుంటే, తన సొంత తెలుపుజాతి వాళ్లే దారుణంగా దాడిచేసి, ‘ఏమే నీచపుదానా! మన జాతి వర్ణాన్నే మార్చాలని చూస్తావే? హంసలా పుట్టి కాకిలా మారటమేంటే భ్రష్టురాలా!’ అంటూ నలుపుగా మారిన తెలుపుపై చెప్పలేని అశ్లీల భాషను ఉపయోగించారు!
ఆ నలుపుగా మారిన తెలుపుని పాతకాలంనాటి పెద్ద పెద్ద గంగాళాలలో పురాతన వర్ణ ద్రావకాలలో ముంచి సంప్రోక్షణలు, శుద్ధి క్రియలూ చేసి దానిని మళ్లీ తెలుపురంగులోకి మార్చి వదిలేశారు! అయ్యో పాపం తెలుపు! గుండెలు పగిలే దుఃఖంతో విలపిస్తూ, తను మళ్లీ నలుపు దగ్గరకు తిరిగొచ్చింది. విషయమంతా గ్రహించిన నలుపు తన ప్రేయసి తెలుపుని దగ్గరకు తీసుకొని విశ్వమంత ప్రేమను పంచి శాశ్వత సంగమంతో తనలో కలిపేసుకుంటుంది. ఆశ్చర్యంగా అనంతర యుగాలలో ఈ నలుపు–తెలుపులు రెండూ కూడా క్రమంగా తమ తమ రంగుల్ని విడిచి ‘నిర్వర్ణం’ కాసాగాయి.’
‘ఎందుకమ్మా ఆ ఇంట్రోని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదువుతున్నావు?’
‘అబ్బ బామ్మా! ఇంత లోతుగా రాశావంటే నువ్వు ప్రపంచాన్ని ఎంత బాగా చూసి ఉంటావు!’
‘నే చూసింది మాత్రమే రాయలేదే!’
‘మరి?’
‘నేను చేసింది, నాకు నే చేసుకుంది, లోకం నాకు చేసిందీ కూడా!’
‘నిర్వర్ణం– ద కలర్ ఈజ్ డెడ్’– ‘అసలీ పుస్తకం టైటిలే అమోఘం బామ్మా! ఈ పుస్తకానికి ఒకే ఏడాది సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు, బుకర్ ప్రైజ్ రావటం రియల్లీ ఆసమ్! యు మేడ్ హిస్టరీ, గ్రాండీ!’
‘ఈ అవార్డులు రివార్డుల కన్నా నా మనవరాలులాంటి ఎంతోమంది యూత్ నా పుస్తకాలు చదివి, స్పందించటం అతి గొప్ప ప్రశంస అమ్మా! రోజూ ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్లో..’ అంటూ మనవరాలి నుదుటిపై ఓ తియ్యటి ముద్దిచ్చింది విశ్వంభర.
‘గ్రేట్ బామ్మా! కీప్ రాకింగ్!’
‘షాకింగ్ టూ బేబీ!’
ఇద్దరూ ఒక్కసారే ఫెళ్లుమని నవ్వారు.
‘బ్రేకింగ్ న్యూస్’
‘ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద రచయిత్రి శ్రీమతి విశ్వంభరకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం, ఈ ఉదయం ఆమెకు అవార్డు ప్రకటించిన భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ. ఒక భారతీయ మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, బాహాటంగా రాయగలగడం మహా సాహసం అని అవార్డు కమిటీ సభ్యులు విశ్వంభరను ప్రశంసించారు. చిన్ననాడు తను ఈడుకొస్తున్న రోజుల్లో తన మేనమామ వెంటబడి ఎలా హింసించాడో, తాను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటానంటే తన తండ్రి తనను ఎలా గృహనిర్బంధంలో ఉంచాడో, ఆ సమయంలో తనను బంధించిన గదిలో మేనబావలు నీచంగా, నిర్లజ్జగా ‘ఆ జాతి తక్కువ వాడితో కాకపోతే మనలోనే ఎవడో వరసైనవాడిని తగులుకోరాదటే!’
అంటూ తనపై తోడేళ్లలా ఆ రోజు ఎలా దాడికి సిద్ధమయ్యారో– ఇవన్నీ తెలిసి కూడా ఖండించని తన బామ్మ, అభ్యుదయ రచయిత్రి అయిన శ్రీమతి సత్యవేణమ్మతో ఒక సందర్భంలో మాటా మాటా పెరిగి చివరికి వారిరువురి మధ్యన జరిగిన చిన్న పెనుగులాటలో సీనియర్ రైటర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవటం ఎలా జరిగిందో; అదంతా అన్ ఫోర్స్డ్ ఎర్రర్లా జరిగిందని తాను పశ్చాత్తాపంతో ఎంత మొత్తుకున్నా ఎవరూ అర్థం చేసుకోలేదని; చివరికి తాను జైలుపాలైనప్పుడు సైతం జైలు అధికారుల్లో ఒకడు దారుణంగా భయపెట్టి తనను ఎలా శారీరకంగా దోచుకున్నాడో; ఇదంతా తెలిసీ తను విడుదలైన తర్వాత తనను స్వీకరించి వివాహం చేసుకున్న భర్తతో కూడా సంసార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అనుభవించిందో; భర్త మరణం తర్వాత ఒంటరిదై ఒక తోటి నవలా రచయితతో తను స్నేహం చేసేటప్పుడు ఇంటా బయటా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నదో– అలాంటి ఎన్నో జీవితానుభవాల్ని ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రాసినందుకు శ్రీమతి విశ్వంభర ఎట్టి అవార్డుకైనా అర్హురాలేనని అభ్యుదయవాదులు అంటున్నారు.
అయితే మాజీ నేరస్థురాలు, ముప్పయ్యేళ్లుగా తన రచనలతో హద్దుమీరిన స్వేచ్ఛను, తిరుగుబాటు ధోరణిని, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో ఆడవాళ్ళను తప్పుదారి పట్టిస్తూ వచ్చిన ఈ రచయిత్రికి ఇంత అత్యున్నత సాహితీ పురస్కారం ఇవ్వటం పట్ల అటు పురుషుల ఐక్య సంఘాల జేఏసీనే గాకుండా, ఇటు కొన్ని మహిళా సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి.
అత్యంత వివాదాస్పదమైన ఈ అవార్డు ప్రకటన అంశం గురించి చర్చించటానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవిపండితులు, సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ అవాకుల అప్పారావుగారు, ప్రముఖ అభ్యుదయవాది, ఎమ్మెల్సీ అయిన శ్రీమతి చెవాకుల సక్కుబాయిగారు– ఇంకా.................గారు, ................. గారు కూడా.’
మొదటి వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’
రెండవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’
మూడవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’
‘ఈనాటి ఈ బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా.... లైవ్ డిబేట్ ఇంతటితో ముగిసింది. నిత్యం ‘తాజా లొల్లి’ కోసం మన సత్యం‘బాజా’ చానల్ను వీక్షిస్తూనే ఉండండి– వీక్షిస్తూనే ఉండండి– తర్వాతి కార్యక్రమం ‘మేం వాగుతునే ఉంటం– మేం వాగుతునే ఉంటం’
‘స్టే ట్యూన్డ్!’
Comments
Please login to add a commentAdd a comment