
వేల్స్ కొత్త చరిత్ర
లిల్లీ: యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ బెల్జియం ఇంటిముఖం పట్టింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన పోరులో పసికూన వేల్స్ 3-1 తేడాతో బెల్జియంను బోల్తా కొట్టించి సెమీస్ కు చేరింది. తద్వారా ఓ ప్రధాన టోర్నీలో తొలిసారి సెమీస్ కు చేరి కొత్త చరిత్ర సృష్టించింది.
ఆట 13వ నిమిషంలో బెల్జియంకు రాద్జా తొలి గోల్ ను అందించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఈడెన్ హజార్డ్ నుంచి పాస్ ను అందుకున్న రాద్జా గోల్ గా మలచాడు. కాగా, ఆట 30వ నిమిషంలో వేల్స్ ఆటగాడు ఆష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన వేల్స్..పటిష్టమైన బెల్జియం ఎటాక్ ను నిలువరించడమే కాకుండా, మరో రెండు గోల్స్ నమోదు చేసి అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆట 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కాను, 85వ నిమిషంలో శ్యామ్ వేక్స్ తలో గోల్ చేయడంతో వేల్స్ ఘనమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి.