కొత్త రికార్డు సృష్టిస్తారా? | will india create another record | Sakshi
Sakshi News home page

కొత్త రికార్డు సృష్టిస్తారా?

Published Thu, Dec 14 2017 11:42 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

will india create another record - Sakshi

మొహాలి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుతవిజయాన్ని సాధించిన టీమిండియాను ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది. అది కూడా వన్డే క్రికెట్‌ చరిత్రను తిరగరాశే రికార్డు. ఇప్పటివరకూ వన్డే క్రికెట్‌ చరిత్రలో  ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లలో దక్షిణాఫ్రికా-టీమిండియాలు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించగా, 2017లో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది.  అయితే వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండు సార్లు 18 సెంచరీల మార్కును చేరిన జట్టు టీమిండియానే.. అంతకుముందు 1998లో టీమిండియా తొలిసారి 18 వన్డే సెంచరీలు నమోదు చేసింది.

కాగా, ఈ ఏడాది భారత్‌ జట్టు వన్డేల్లో నమోదు చేసిన సెంచరీల సంఖ్య 18. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సరసన భారత్‌ నిలిచింది. ఆదివారం విశాఖలో జరిగే మూడో వన్డేలో భారత జట్టు ఒక్క సెంచరీ సాధిస్తే, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలుస్తుంది.

ఈ ఏడాది భారత్‌ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు సెంచరీలు చేయగా, అజింక్యా రహానే, కేదర్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు. లంకేయులతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్‌ జట్టు సెంచరీ నమోదు చేస్తే వన్డే క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది.

19 ఏళ్ల క్రితం భారత్‌ జట్టు తొలిసారి 18 వన్డే సెంచరీలు ఖాతాలో వేసుకుంది. ఆ ఏడాది సచిన్‌ టెండూల్కర్‌ విశేషంగా రాణించి తొమ్మిది సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో 18 సెంచరీలను భారత్‌ నమోదు చేసి కొత్త రికార్డు లిఖించింది. కాగా, రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా ఆ రికార్డును సమం చేసింది. కాగా, భారత​ జట్టు దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలను మరొకసారి సాధించడం ఇక్కడ విశేషం. మరొకవైపు వన్డే చరిత్రలో ఒక క్యాలండర్‌ ఇయర్‌లో పది, అంతకుపైగా సెంచరీలను నమోదు చేయడం  భారత్‌ జట్టుకు ఇది పదోసారి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement