నగరంలో గుండె జబ్బులతో మృతి చెందుతున్నవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది...
- ముంబైలో పెరుగుతున్న ‘గుండె’ మృతులు
- తర్వాత స్థానంలో క్షయ, క్యాన్సర్
- కాలుష్యం, పని ఒత్తిడే కారణ మంటున్న వైద్యులు
సాక్షి, ముంబై: నగరంలో గుండె జబ్బులతో మృతి చెందుతున్నవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. గుండె జబ్బులతో మృతి చెందుతన్న వారి సంఖ్య మొదటి స్థానంలో ఉండగా తర్వాత రెండు, మూడు స్థానాల్లో క్షయ, క్యాన్సర్ ఉన్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) నుంచి ఆర్టీఐ కార్యకర్త చేతన్ కోఠారి సేకరించిన సమాచారంలో వెల్లడైంది. 2014-15 మధ్యలో రోజుకు 18 మంది గుండెకు సంబంధించిన వ్యాధులతో మరణించగా, 15 మంది ముంబైకర్లు క్షయ వ్యాధితో మృతిచెందారు. బీఎంసీ సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ జబ్బుల కంటే గుండెకు సంబంధించిన వ్యాధులే ఆధిపత్యం వహిస్తున్నాయన్నారు.
ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినపుడు నగరంలో గుండె జబ్బులతో మృతి చెందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని బైకల్లాలోని జేజే ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం డాక్టర్ బన్సల్ అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 20 నిమిషాలైనా వ్యాయామం తప్పని సరి అవసరమని సూచించారు. నగర వాసులు ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం లేదని, శారీరక వ్యాయామం చేయడం లేదని చెప్పారు. పరేల్లోని గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ అజయ్ చౌగులే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికంటే పట్టణ ప్రాంతంలోని వారికే ఎక్కువగా గుండె జబ్బులు వస్తుంటాయన్నారు.
కొవ్వు పదార్థాలు ఎక్కువగా స్వీకరించడం, శరీరానికి సరైన వ్యాయామం ఉండకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారన్నారు. చక్కర అధికంగా ఉన్న పానీయాలు, పదార్థాలు తినడం వల్ల ఒబెసిటీ, డయబెటీస్, హార్ట్ఎటాక్ లాంటి జబ్బులు పట్టణ వాసులకు వస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం, పని ఒత్తిడి ఎక్కువ అవడం కూడా రోగాలబారిన పడటానికి ప్రధాన కారణం అన్నారు. నగరవాసులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అన్నారు.