వామ్మో చిన్నమ్మా.. నాకొద్దు ఈ పిటిషన్‌ | Judge Rejected Sasikala Case Petition Tamil nadu | Sakshi
Sakshi News home page

వామ్మో చిన్నమ్మా

Published Thu, Jul 5 2018 9:59 AM | Last Updated on Thu, Jul 5 2018 9:59 AM

 Judge Rejected Sasikala Case Petition Tamil nadu - Sakshi

చిన్నమ్మ శశికళ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించేందుకు న్యాయమూర్తినిరాకరించారు. తనకు ఈ కేసు  వద్దు అని, మరో బెంచ్‌కు అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తికి బుధవారం సిఫారసు చేశారు.

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల అమ్మ, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ అండ్‌ కుటుంబీకుల మీదున్న కేసుల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. అనేక కేసులో విచారణలో ఉన్నాయి. హైకోర్టులో కొన్ని, ఎగ్మూర్‌ కోర్టులో మరికొన్ని, ప్రత్యేక కోర్టులో ఇంకొన్ని ఇలా కేసుల విచారణ ఏళ్ల తరబడి వాయిదాల పర్వంతో సాగుతూ వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమె జైలుకు వెళ్లడంతో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణల వేగం పెరిగింది. దీంతో చిన్నమ్మ అండ్‌ కుటుంబాన్ని ఈ కేసులు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ చిన్నమ్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించడం గమనార్హం.

నాకొద్దు ఈ పిటిషన్‌ : 1996–97 కాలంలో రూ. నాలుగు కోట్ల 97 లక్షలు విలువైన ఆస్తులకు గాను చెల్లించాల్సిన  రూ. పది లక్షల 13 వేలు పన్నును శశికళ ఎగ్గొట్టినట్టుగా ఆదాయ పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న ఈ కేసును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టును చిన్నమ్మ  ఆశ్రయించారు.  ఆదాయ పన్ను శాఖ తన మీద దాఖలు చేసిన కేసు విచారణకు స్టే విధించాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణలో ఉంది. బుధవారం పిటిషన్‌ విచారణ న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రశాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు వచ్చింది.

పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ప్రశాంత్‌ తాను విచారించ దలచుకోలేదని వ్యాఖ్యానించారు. గతంలో తాను శశికళకు సంబంధించిన కేసులకు హాజరు అయ్యానని, ఈ దృష్ట్యా, తాను ఈ కేసును విచారించే లేనని స్పష్టం చేశారు. దీంతో మరో న్యాయమూర్తి  సైతం పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ, దీనిని మరో బెంచ్‌కు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దీంతో తమ బెంచ్‌ ముందు ఉన్న ఈ పిటిషన్‌ను మరో బెంచ్‌కు అప్పగించాలని కోరుతూ న్యాయమూర్తి సుబ్రమణ్య ప్రశాంత్‌  ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి్జకి విజ్ఞప్తితో కూడి సిఫారసు చేశారు. ఈ దృష్ట్యా, కేసు విచారణ మరి కొంత కాలం జాప్యంతో సాగే అవకాశాలు ఎక్కువే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement