విధులకు ఆలస్యంగా వచ్చే మంత్రాలయ ఉద్యోగులకు కఠినంగా అమలుచేసే నియమాలను బీజేపీ, శివసేన
సాక్షి, ముంబై: విధులకు ఆలస్యంగా వచ్చే మంత్రాలయ ఉద్యోగులకు కఠినంగా అమలుచేసే నియమాలను బీజేపీ, శివసేన కాషాయ కూటమి ప్రభుత్వం కొంత సడలించింది. ఇదివరకు నెలలో రెండు సార్లు మాత్రమే విధులకు అలస్యంగా వచ్చేందుకు మినహాయింపు ఉండేది. ఆ తరువాత ఆలస్యంగా వస్తే సెలవుల్లో ఒకరోజు కోత విధించేవారు. అయితే జనవరి ఒకటో తేదీ (గురువారం) నుంచి ఈ నియమాల్లో మార్పులు చేశారు. ఆ రోజు ఉద్యోగులు ఎన్ని నిమిషాలు, గంటలు ఆలస్యంగా వచ్చారో సాయంత్రం అన్ని గంటలు ఎక్కువ పనిచేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఈ కొత్త నియమాల వల్ల ఉద్యోగుల సెలవులు కోతకు గురికాకుండా ఉన్నప్పటికీ సాయంత్రం మాత్రం ఆలస్యంగా పనిచేయాల్సి ఉంటుంది. మంత్రాలయలో పనివేళలు ఉదయం 9.45 గంట నుంచి సాయంత్రం 5.3 గంటల వరకు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఠాణే, కల్యాణ్, కర్జత్ తదితర నగర శివారు ప్రాంతాల నుంచి వస్తారు. సెంట్రల్, హార్బర్, పశ్చిమ లోకల్ రైల్వే మార్గాలలో తరుచూ ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక సాంకేతిక కారణంవల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది.
మరోపక్క ట్రాఫిక్ జాంలో ఎలాగో దారి వెతుక్కుంటు పరిగెత్తాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. సమయానికి కార్యాలయానికి చేరుకోవాలనే తపనతో ఇంటి నుంచి తొందరగా బయటపడినప్పటికీ ట్రాఫిక్ జాం, లోకల్ రైళ్ల కారణంగా ఆలస్యమవుతోంది. దీంతో అనేక మంది ఉద్యోగులకు లేట్ మార్క్ పడుతోంది.
చేయని తప్పుకు శిక్ష పడడంతో ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కాషాయకూటమి ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగా ఎంత ఆలస్యంగా వచ్చారో సాయంత్రం విధులు ముగిసిన తర్వాత కార్యాలయంలో కూర్చుని అదనంగా పనిచేయాలని ఆంక్షలు విధించారు. దీంతో ప్రభుత్వ, ప్రజల పనులు సకాలంలో పూర్తవుతాయని ప్రభుత్వం భావించింది.
ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కాషాయకూటమి ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ప్లానింగ్ విభాగం అప్పర్ ప్రధాన కార్యదర్శి కె.పి.బక్షి కి హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. హోం శాఖ అప్పర్ ప్రధాన కార్యదర్శి అమితాబ్ రాజన్ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం బక్షిని నియమించింది. మైనార్టీ శాఖ అప్పర్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ను మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
మైనార్టీ శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను జయశ్రీ ముఖర్జీకి అప్పగించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో పనిచేసిన ఉజ్వల్ ఉకే ను సామాజిక న్యాయ శాఖ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మ్యుచ్యువల్ ట్రాన్స్ఫర్పై వచ్చిన విజయ్ కుమార్ను మంత్రాలయలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) లో అదనపు కమిషనర్ వికాస్ ఖర్గేను రెవెన్యూ, అటవీ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.