జియో ఫోనంటే ఆసక్తి ఉందా?
న్యూఢిల్లీ : టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మొబైల్ మార్కెట్లోనూ సంచలనాలు సృష్టించడానికి వచ్చేసింది. జీరోకే జియో ఫోన్ను ఇటీవల జరిగిన ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లాంచ్ చేశారు. ఈ ఫోన్పై ఇప్పటికే వినియోగదారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫోన్ బుకింగ్స్, అప్డేట్లపై తెగ ఆసక్తి చూపుతున్నారు. జియో ఫోన్ను కొనుగోలుచేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారుల కోసం రిలయన్స్ జియోనే ఓ స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జియో వెబ్సైట్లో లాగిన్ అయి, తమ పేరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే, ఈ డివైజ్ గురించి ప్రతి అప్డేట్ను కంపెనీనే డైరెక్ట్గా వినియోగదారులకు అందిస్తోంది.
ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ బీటా-టెస్ట్కు వస్తోంది. ఆగస్టు 24 నుంచి రిలయన్స్ రిటైల్, జియో స్టోర్లు, ఆన్లైన్లో ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ కంపెనీనే జియో ఫోన్ మార్కెటింగ్ చేపడుతుందని దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఏ కస్టమర్లైతే, తమ ఇంటరెస్ట్ మేరకు వివరాలు నమోదు చేసుకుంటారో వారికి జియోఫోన్ బుకింగ్, అందుబాటులో ఉండే వివరాలు వంటి వాటిని అప్ డేట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియను ఈ-కామర్స్ కంపెనీలు చేపడుతున్నాయి. తమ వెబ్సైట్లో ప్రత్యేక ప్రొడక్ట్ కావాలని రిజిస్ట్రర్ చేసుకుంటే, దాని గురించిన సమాచారం అందిస్తూ ఉంటాయి.
రిలయన్స్ జియో తాజాగా లాంచ్చేసిన ఈ ఫోన్, 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫీచర్ ఫోన్. రూ.153తో రీఛార్జ్ చేయించుకున్న వారికి ఈ ఫోన్లో ఉచితంగా వాయిస్ సర్వీసులు, అపరిమిత డేటా అందించనుంది. అంతేకాక ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. తొలుత రూ.1500 కట్టి దీన్ని కొనుగోలు చేస్తే, మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేసేస్తోంది. ఈ ప్లాన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.