
నల్లగొండ క్రైం : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగింది. మందు ప్రియుల జేబుకు చిల్లు పడగా.. ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు జరిగిన కార్యక్రమాలతో ఒక్క రోజులోనే (డిసెంబరు 31వ ) రూ.3 కోట్ల మద్యం సేల్ అయ్యింది.ఇక, డిసెంబరు నెల విషయానికి వస్తే.. 2017 డిసెంబర్ ఒక్క నెలలో రూ.83 కోట్ల 2లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, 2018 డిసెంబర్లో రూ.95 కోట్ల 28 లక్షల విలువ గల మద్యం అమ్మకాలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018 డిసెంబర్లో రూ.12.26 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి
కేవలం డిసెంబర్ 31 నాడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల 15 లక్షల విలువైన మద్యం వైన్షాపులకు చేరగా... అందులో రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 138 వైన్షాపులు, 18 బార్లు, నాగార్జునసాగర్, నల్లగొండల్లో క్లబ్బులు ఉన్నాయి. డిసెంబర్ 31న మద్యం డిపో నుంచి వైన్షాపులకు 8,185 లిక్కర్ పెట్టెలు, 10,298 బీర్ పెట్టెలు తరలాయి. మొత్తం రూ. 5,15 లక్షల విలువైన మద్యం వైన్షాపులకు చేరగా రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున రూ.2 కోట్ల 50 లక్షల మద్యం అమ్మకం ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి శంకరయ్య తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత బీర్లను పొంగించారని మద్యం అమ్మకాలు రుజువు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment