
హైదరాబాద్: రాజ్భవన్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో అఖిలపక్షనాయకులు గురువారం భేటీ అయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తెలంగాణ జనసమతి అధ్యక్షులు కోదండ రాం, టీటీడీపీ అధ్యక్షులు ఎల్రమణ, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. గవర్నర్తో భేటీలో ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న రాజకీయ ఫిరాయింపులపై అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు.
ఇంటర్మీడియట్లో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే చూడాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఇంటర్కు సంబంధించి అన్ని పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్లోబెరినా ఐటీ సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కేబినేట్ నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment