
మంచి చేస్తే మద్దతిస్తాం..లేకుంటే యుద్ధమే
చీప్ లిక్కర్పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి
కూసుమంచి: మంచి చేస్తే మద్దతిస్తాం.. లేకుంటే యుద్ధం చేస్తామని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చీప్లిక్కర్పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌట్పల్లిలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సారాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మంచి పనులు చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుందని..లేకుంటే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ఆవగింజంతయినా అభివృద్ధి చేయలేదన్నారు.
ఇకనైనా మేల్కొని ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు. పక్కాఇళ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయూలని కోరారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాల్టీల్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల పేర్లు, డిజైన్లు, స్థలాలు మార్చడం సరికాదన్నారు. వైఎస్ హయూం స్వర్ణయుగమని, దాన్ని ఎవరు రూపుమాపాలని చూసినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.