జాతీయ స్థాయి అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు రికార్డు సంఖ్యలో ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందారు.
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు రికార్డు సంఖ్యలో ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఇప్పటి వరకూ 1010 మంది విద్యార్థులు (2015 బ్యాచ్) క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారని సీబీఐటీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ హెడ్ డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి గురువారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తమ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులకు దేశంలోనే అత్యధిక వార్షిక వేతనాన్ని రూ. 12 లక్షలు ఆఫర్ చేసిందని ఆయన వెల్లడించారు.
డెల్లాయెట్, ఆక్సెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఆఫర్ చేశాయని వివరించారు. జేపీ మోర్గాన్, ఫోర్డ్, ఐగేట్ వంటి ఐటీ, ఉత్పత్తి, తయారీ సంస్థలు ప్లేస్మెంట్ల కోసం తమ కాలేజీకి రానున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సీబీఐటీ అధ్యక్షుడు ఉండేలా మాలకొండారెడ్డి అభినందనలు తెలిపారు.