
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ డీజీపీ మహేందర్ అన్నారు. నగరంలోని గోషా మహల్ సెంటర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్రెడ్డి, గవర్నర్ నరసింహన్, సీపీ అంజన్ కుమార్లు పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల సేవలను కొనియాడారు. దేశ వ్యాప్తంగా దాదాపు 414 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా, తెలంగాణలో ఇద్దరు పోలీసులు మరణించారని మహేందర్రెడ్డి గుర్తుచేశారు. వారి త్యాగం మరువలేనిదని, వారి కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ సరిహద్దులో, శాంతి భద్రతలను కాపాడేది పోలీసులు మాత్రమేనని అన్నారు.
విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవసభలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని అమరువీరుల స్తూపానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, నివాళి అర్పించారు. పొలీసుల కుటుంబాల సంక్షేమం తన బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ప్రతి స్టేషన్కు కొత్త వాహానాలను అందిస్తామని హామీ ఇచ్చారు. నేరాలను అదుపు చేయడానికి టెక్నాలజీని మరింత వాడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment