
కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
కామారెడ్డి టౌన్: వైద్యులు నిర్లక్ష్యంగానే గర్భంలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ, ఇందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఎర్రంగారి యశోద పురిటి నొప్పులతో ప్రసవం కోసం బుధవారం ఉదయం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షించి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
ఇంకా సమయం ఉందని ఆసుపత్రిలో ఉంచారు. తమ భార్యకు నొప్పులు వస్తున్నాయని మొదటి కాన్పు అని అవసరమైతే ఆపరేషన్ చేయాలని వైద్యులను వేడుకున్నానని యశోద భర్త భరత్ వాపోయాడు. బుధవారం అర్ధరాత్రి నొప్పులు రావడంలో ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్కు సమాచారం ఇచ్చారు. గైనిక్ వైద్యులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంలో సర్జన్ వైద్యులు నర్సింహరెడ్డి యశోదకు అర్ధరాత్రి సీజరియన్ చేశారు. అప్పడికే గర్భంలోనే ఆడ శిశువు మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. రాత్రి కావడంలో శిశువు మృతదేహన్ని ఆసుపత్రిలో ఉంచవద్దని, బయటకు తీసుకెళ్లాలని సిబ్బంది, సెక్యూరిటి దబాయించి బయటకు గెంటేశారని బంధువులు ఆరోపించారు.
దీంతో రాత్రి శిశువును ఖననం చేశామన్నారు. గురువారం ఉదయం ఆసుపత్రిలో వైద్యాధికారులతో వాగ్వాదం చేశారు. బుధవారం ఉదయమే మిగతా మహిళలలతో పాటు తమ భార్యకు సీజరియన్ చేస్తే శిశువు బతికుండేదని భరత్ తెలిపాడు. ఆశ కార్యకర్తలు సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకోస్తే గైనిక్ వైద్యులు లేరంటూ రిఫర్లు చేస్తున్నారని, ఇలా శిశువుల మరణాలకు కారణమవుతున్నారని వాపోయారు. అనంతరం పట్టణ పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్కుమార్ను వివరణ కోరగా శిశువు ఉమ్మ నీరు మింగడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment