
ఆదివాసీల హక్కులను కాలరాయొద్దు
- బహుళజాతి సంస్థలకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకే గ్రీన్హంట్
- ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి : ప్రొఫెసర్ హరగోపాల్
- హైకోర్టు షరతులు, పోలీసు నిర్బంధం మధ్య ప్రజాస్వామిక వేదిక సదస్సు
న్యూ శాయంపేట(వరంగల్): ఆదివాసీల హక్కులను కాలరాసి, వారిని మట్టుబెట్టి.. మల్టీ నేషనల్ కంపెనీలకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్హంట్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్లో ఇలాంటి చర్యలు తగవన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని హరగోపాల్ ఆరోపించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నా రు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాథ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర ్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ స్వాతం త్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జీఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, ప్రొఫెసర్ ఖాసీం, కోట శ్రీనివాసరావు, రవీందర్రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు.
నిర్బంధం మధ్య బహిరంగ సభ..
హన్మకొండలో అనేక నిర్బంధాల మధ్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభ జరిగిన తీరును, హంటర్రోడ్ నుంచి సభకు వచ్చేవారిని వీడియో తీశారు. ప్రధాన వక్త అరుున విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధంలోనూ బహిరంగసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడం గమనార్హం.