
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఈసారి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కోవిడ్ విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. అయితే కేంద్రం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. లాక్డౌన్ను ఏప్రిల్ 14 వరకు ప్రకటించింది. మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ మరో వారం పొడిగిస్తే కనుక అసలు సాధ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment