ఏమిటీ జాప్యం.. | High Court fires on the neglect of postal department | Sakshi
Sakshi News home page

ఏమిటీ జాప్యం..

Dec 15 2018 3:21 AM | Updated on Dec 15 2018 3:21 AM

High Court fires on the neglect of postal department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ కేసుల్లో న్యాయస్థానాలు పంపుతున్న నోటీసులు, సమన్లు తదితరాలను ఆయా వ్యక్తులకు అందచేయడంలో పోస్టల్‌ విభాగం చూపుతున్న నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. న్యాయస్థానాల నుంచి వెళ్లే నోటీసులు, సమన్లు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పోస్టల్‌శాఖపై ప్రజలు నమ్మకం కోల్పోతారంది. ఇదే సమయంలో నోటీసుల అందచేతలో జరిగే అసాధారణ జాప్యంవల్ల మొత్తం న్యాయవ్యవస్థే కదిలిపోయే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల నుంచి వెళ్లే నోటీసులు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్‌ సిబ్బంది చాలా ఉదాసీనంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, ఎవరికి నోటీసులు అందచేయాలో ఆవ్యక్తి లేరని, గ్రామం నుంచి వెళ్లిపోయారని, అసలు అటువంటి చిరునామానే లేదని, చిరునామా తప్పు అని పలు కారణాలతో నోటీసులు అందచేయకుండా తిరిగి వెనక్కి పంపుతున్నారంది.

ఇలా చేయడం విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడమేనని స్పష్టం చేసింది. కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వ్యక్తులకు సకాలంలో నోటీసులు అందకపోవడం వల్ల న్యాయస్థానాల్లో కేసులు సత్వర విచారణకు నోచుకోవడం లేదని పేర్కొంది. కింది కోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో పోస్టల్‌ శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితిపై పోస్టల్‌ శాఖలోని ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పేర్కొంది.  

ఉదాసీనంగా ఉండే సిబ్బందిపై చర్యలకు ఆదేశం 
విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం వారికి బయటకు వెళ్లే ద్వారాలను చూపాలంది. న్యాయస్థానాలు ఇచ్చే నోటీసులను సంబంధిత వ్యక్తులకు అందచేయకపోవడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. పోస్టల్‌ అధికారులు తాము నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకపోవడమేనని పేర్కొంది. ఈ ఆదేశాల గురించి తెలంగాణ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందులో కేంద్ర పోస్టల్‌శాఖ కార్యదర్శి, తెలంగాణ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చాలంది. ఈ వ్యాజ్యంపై ఈ నెల 28న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement