
సోమారపు సత్యనారాయణ(పాత చిత్రం)
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల జీతాలు పెరగాల్సిన అవసరముందని, తాము మిగతా వాళ్లలా రేట్లు పెంచుకోలేమని, ఆర్టీసీలో పెట్టుబడులు లేకపోవడం తమ దౌర్భాగ్యమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..వ్యవస్థలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని, ఆర్టీసీ మంచి ప్రజా రవాణా సంస్థ అని, తన కాళ్ల పై తాను నిలబడేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని చెప్పారు. ఆటోలు కూడా తమకు కాంపిటీషనేనని, చిన్నచిన్న వాళ్లతో కూడా పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
టీ-వాలెట్ కేటీఆర్ మానస పుత్రిక అని, ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయిస్తానని వెల్లడించారు. 13 వేల మంది ఆన్లైన్ ద్వారా, 6 వేల మంది ఈ-టికెట్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు.ఆర్టీసీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, బయటికి పంపించి వేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో అక్రమాలపై విచారణ జరుపుతున్నామని, 5 లక్షల లీటర్ల డీజిల్ను ఆర్టీసీ ఒకరోజులో వాడుతోందని తెలిపారు. ఎలాంటి కండిషన్ లేకుండా టెండర్ రేట్ ప్రకారం బయోడీజిల్ తీసుకుంటామని, తమకు లక్ష లీటర్ల బయోడీజిల్ అవసరముందని వెల్లడించారు.
ప్రభుత్వ నిధులు ఇవ్వని సందర్భంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నామని వివరించారు. తాము 700 కోట్ల రూపాయలతో ఆర్టీసీని నడుపుతున్నామని..3 నెలలు జీతాలు ఆలస్యం అయితే చచ్చిపోతారా అని ప్రశ్నించారు. ఎవరూ కూడా ప్రెస్టీజ్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్తుల విభజన అనగానే ఏపీ అధికారులు పారిపోతున్నారని, తెలంగాణ ఆస్తుల మీద ఏపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి బస్భవన్ బిల్డింగ్పై 52 శాతం మాత్రమే హక్కు ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment