
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లికి దండ వేసి గౌరవించాకే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ సభలు జరుగుతాయని, సభలకు 8 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సభల్లో పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు ప్రక్రియలపై చర్చలుంటాయన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించవని, పిలిచినా కూడా వారు రారనే ఉద్దేశంతోనే పిలవలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అన్నీ ఢిల్లీ నుంచే వస్తాయి కాబట్టి తెలంగాణ తెలుగు రుచించట్లేదని ఎద్దేవా చేశారు.