కుదిరితే రాజీ .. లేదంటే టెండర్ రద్దు | Possible compromise or cancel the tender | Sakshi
Sakshi News home page

కుదిరితే రాజీ .. లేదంటే టెండర్ రద్దు

Aug 7 2015 3:41 AM | Updated on Sep 3 2017 6:55 AM

రామగుండం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల పెత్తనమే నడుస్తోంది...

- బల్దియాలో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
- 50 రోజులుగా తెరవని రూ.4.5 లక్షల విలువైన టెండర్లు
- కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు
కోల్‌సిటీ :
రామగుండం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల పెత్తనమే నడుస్తోంది. అధికారులు సైతం ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి వారికే వంతపాడుతున్నారు. కాంట్రాక్టరకు లబ్ధిచేకూర్చడానికి టెండర్లు ఖరారు కాకుండా జాప్యం చేస్తున్నారు. ‘కుదిరితే సిండికేట్.. కుదరకపోతే టెండర్ల రద్దు’ చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. రూ.4.5 కోట్లతో పిలిచిన టెండర్లు 50 రోజు లు గడుస్తున్నా తెరవక పోవడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.
 
రామగుండం కార్పొరేషన్ అధికారులు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇటీవల పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను 50 రోజులు దాటినా ఖారారు చేయలేదు. జూన్ 16న టెం డర్లు తెరవాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఈ టెండర్ల లో పనులు దక్కించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు రాజీకి వచ్చారు. వీరి నుంచి కమీషన్ల రూపంలో రూ.36 లక్షల వరకు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే వీటి పంపకాల్లో వివాదం తలెత్తడంతో టెండర్లను తాత్కాలికంగా జాప్యం చేయాలని అధికారులపై కాంట్రాక్ట ర్లు ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.  

రూ.35 లక్షల టెండర్ల పరిస్థితి అయోమయం
ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఇటీవల రూ.35లక్షల విలువై న పనులకు పిలిచిన టెండర్ల పరిస్థితి సైతం అయోమయానికి దారితీస్తోంది. ఈ టెండర్లకు గురువారం షెడ్యూళ్ల దాఖాలకు చివరి తేదీ.. నేడు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే గతంలో పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను ఖరారు చేయని అధికారులు, కొత్తగా పిలిచిన రూ.35 లక్షల టెండర్లను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది.
 
నోరుమెదపని అధికారులు
బల్దియాలోని అనేక టెండర్లపై ఆరోపణలు వస్తున్నా వాటి పై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం నోరుకూడా మెదపడంలేదు. పారిశుధ్య కార్మికులకు పిలిచి న టెండర్లను తెరవడానికి మూడు నెలలపాటు ఆలస్యం చేసి చివరికి ఖరారు చేశారు. వీటికి బల్దియా పాలకవర్గం అనుమతి తీసుకోకుండానే పెండింగ్ అప్రోవల్‌తో జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటితోపాటు రూ.4.5 కోట్ల టెండర్లలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిని రద్దు చేయాలంటూ అధికారి పార్టీ టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పోటీపడి ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు ఇచ్చారు. వీటిపై స్పందించి విచారణ జరిపిన నాథుడు లేడు. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం టెండర్లను తెరవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ గందరోగళంపై పాలకవర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement