
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ వివాహం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి ఆనంతో జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ.. వారి పెళ్లిని సానియా ధృవీకరించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతుందని ఆమె తెలిపారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా ఈ అసద్-ఆనంల పెళ్లి విషయాన్ని ప్రస్తవించారు.
కాగా మూడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్ను నిఖా చేసుకున్న ఆనం.. అనంతరం వారి బంధానికి గుడ్బై చెప్పారు. ఇటీవల అతని నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. అయితే అతనితో దూరంగా ఉంటున్న సమయంలోనే అసద్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి.. డిసెంబర్లో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.