
లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాలు సాధించాలన్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశంతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఒకే పార్లమెంటు స్థానంలో తృప్తిపడ్డ కమలనాథులు ఈసారి కనీసం మూడు సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది తొమ్మిది వరకు చేరుకునేలా చేయాలన్న లక్ష్యం ముందుంచటంతో రాష్ట్ర నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జనచైతన్య యాత్రల పేరుతో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు, రోడ్షోలు నిర్వహించనున్నారు.
ఇందులో తొలివిడత కార్యక్రమాలు ఈనెల 23 నుంచి జూలై 6 వరకు కొనసాగనున్నాయి. నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ నీతిమంతమైన పాలన, దేశ పురోగతి ఒకవైపు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో కుంభకోణా లు, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల అవినీతి పాలనను బేరీజు వేసుకుని ఇక్కడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరటమే లక్ష్యం గా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. 23న తొలిరోజు కార్యక్రమం భువనగిరిలో ఉంటుందని అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ పాల్గొంటారని, అక్కడే రాత్రిబస చేసి మరుసటి రోజు నల్లగొండ, చౌటుప్పల్లలో పర్యటిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. 26న వనపర్తిలో మరో కేంద్రమంత్రి అనంత్కుమార్ పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment