తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో -39 తీసుకురావడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధానకార్యదర్శి మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో -39 ను తీసుకొచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి అన్నారు. జీవో 39తో రెవిన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని వాదించారు.
ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్ట్ రైతు సమితులకు విడుదల చేసిన రూ.500 కోట్లను ఏవిధంగా ఖర్చు చెస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ.500 కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ సూచించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.