
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసి భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, సంస్థను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.
ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ సహా..అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కొందరు అత్యుత్సాహంతో సమ్మెకు దిగారని తలసాని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేస్తే... చత్తీస్ఘడ్లో కాంగ్రెస్ ఏకంగా ఆర్టీసీని రద్దు చేసిందన్నారు. రైల్వేతో పాటు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ, కాంగ్రెస్కు తలసాని సవాలు విసిరారు. ప్రజా రవాణా వ్యవస్తను ప్రభుత్వం మెరుగు పరుస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment