
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో భాగంగా బ్యారేజ్ గేట్లు బిగిస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే పనులు నత్తనడకన సాగుతూ ఉన్నారు. బుధవారం 16వ నంబర్ గేట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్వైర్ తెగింది. దీంతో 200 అడుగుల ఎత్తులో నుంచి వారు ఒక్కసారిగా కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూలీలను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానిక కూలీలు పేర్కొంటున్నారు.