
ఎవరు ముందు వెళ్లాలి?
అది శాసనసభ ప్రాంగణం. ముఖ్యమంత్రి, ప్రొటెం స్పీకర్ ఒకే సమయంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దారిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.
ప్రొటెం స్పీకర్ జానాకు దారిచ్చిన సీఎం
హైదరాబాద్: అది శాసనసభ ప్రాంగణం. ముఖ్యమంత్రి, ప్రొటెం స్పీకర్ ఒకే సమయంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దారిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. వీరిలో ముందుగా ఎవరికి దారివ్వాలి? ఎవరిని ఆపాలని అధికారుల్లో టెన్షన్. శాసనసభ తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత లాబీలోని సీఎం చాంబర్ వద్ద ఈ దృశ్యం కనిపించింది. శాసనసభ మరుసటి రోజుకు వాయిదా పడిన వెంటనే కేసీఆర్ తన చాంబర్లోకి వెళ్లిపోయారు.
అదే సమయంలో పలువురు మంత్రులు, విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా ఆయన చాంబర్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారితో కలసి కేసీఆర్ బయటకు వచ్చారు. అదే సమయంలో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి బయటకు వెళ్తున్నారు. ఇద్దరూ ఎదురుపడటంతో సీఎం కు దారి ఇచ్చేందుకు జానారెడ్డి ఆగిపోయారు. అయితే కేసీఆర్ మాత్రం.. ‘‘మీరు స్పీకర్.. ప్రోటోకాల్ ప్రకారం మీరే ముందుగా వెళ్లాలి. ప్లీజ్...’’అని నవ్వుతూ దారి చూపారు. వెంటనే జానారెడ్డి థ్యాంక్స్ చెబుతూ బయటకు వెళ్లారు.