- రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన ఆగంతుకుడే ఈ హంతకుడు
- చంద్రభాన్ సానాప్ నాసిక్ నివాసి.. గతంలో రైల్వే కూలీ.. పాత నేరస్తుడు
సాక్షి, ముంబై/మచిలీపట్నం: తెలుగమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన కేసును ఛేదించామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు సోమవారం ప్రకటించారు. నిందితు డు పాత నేరస్థుడని.. అతడి పేరు చంద్రభాన్ సానాప్ అలియాస్ చౌక్యాసుదామ్ సానాప్ (28) అని గుర్తించామన్నారు. భాందూప్ సబర్బన్లోని కాంజూర్మార్గ్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ముంబైలోని ఖిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. నిందితుడిని ఈ నెల 15 వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్మారియా చెప్పారు. అయితే.. తమ కుమార్తె హత్య కేసును ఛేదించినట్లు ముంబై పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని అనూహ్య తండ్రి ఆరోపించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసి అయిన సురేంద్రప్రసాద్ కుమార్తె, ముంబై సబర్బన్ గోరేగావ్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఎస్తేర్ అనూహ్య (23) జనవరి ఐదో తేదీన ముంబై కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) చేరుకున్న అనూహ్య అదృశ్యమై, ఆ తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అనూహ్య అదృశ్యమైన 55 రోజుల తర్వాత, ఆమె మృతదేహం లభించిన 45 రోజుల తర్వాత.. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన అనుమానితుడిని చంద్రభాన్ సానాప్గా గుర్తించామని.. అతడిని ఆదివారం కంజూర్మార్గ్ ఈస్ట్లో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు విచారణలో నేరం అంగీకరించాడన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వాస్తవానికి కంజూర్మార్గ్లో స్లమ్ నివాసి. ప్రస్తుతం నాసిక్కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసై రైల్వేకూలీ బ్యాడ్జిని అమ్మేశాడు. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనాలు, నేరాలకు పాల్పడుతుండేవాడు. అతడిపై.. ముంబైలోని గావ్దేవి పోలీస్స్టేషన్తో పాటు నాసిక్, మన్మాడ్, ఇటారసీ తదితర రైల్వే పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
ట్యాక్సీ అని చెప్పి మోటార్సైకిల్పై తీసుకెళ్లాడు!: ‘‘చంద్రభాన్ జనవరి నాలుగో తేదీన తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. ఐదో తేదీ వేకువజామునే కుర్లాలోని ఎల్టీటీకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నించసాగాడు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ఆమె అంధేరి వెళ్లనున్నట్లు తెలుసుకుని రూ. 300 చార్జీకి ఆమెను అంధేరిలో దింపుతానని చెప్పాడు. స్టేషన్ వెలుపల పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లాక.. ట్యాక్సీకి బదులు తన మోటారుసైకిల్ మీద అంధేరీ వెస్ట్కు తీసుకెళ్లి వదిలిపెడతానని నిందితుడు చెప్పాడు.
అనూహ్య తొలుత నిరాకరించారు. అయితే నిందితుడు ఎలాంటి భయం అవసరం లేదంటూ ఆమెకు తన ఫోన్ నెంబరు, మోటర్ సైకిల్ నెంబరు ఇచ్చి ఒప్పించాడు. ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై గల కంజూర్మార్గ్ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్ అయిపోయినట్లుందని చెప్పి సర్సీస్ రోడ్డు పైకి బైకును మళ్లించాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అనూహ్య తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమె తలను నేలకేసి కొట్టి, చున్నీ/స్కార్ఫ్తో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.
ఆ తర్వాత ల్యాప్టాప్తో ఉన్న బ్యాగ్ను తీసుకుని కంజూర్మార్గ్లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్లో తన సెల్ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అయితే ఆమె సెల్ఫోన్ కనిపించలేదు. దీంతో మోటర్సైకిల్లోని పెట్రోల్ను కొంత తీసి ఆమె జీన్స్పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి కంజూర్మార్గ్లోని మిత్రుడు నందకిషోర్ను కలిసి అతని మోటర్సైకిల్ అతనికి ఇచ్చేశాడు. నందకిషోర్కు జరిగిందంతా చెప్పి అదే రోజు నాసిక్కు వెళ్లిపోయాడు. అనూహ్యకు సంబంధించిన లగేజీని భిక్షాటన చేసే ఓ మహిళకు ఇచ్చేశాడు’’ అని పోలీసులు వివరించారు.
దర్యాప్తులో.. నిందితుడి నుంచి హతురాలి ట్రాలీ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే.. నిందితుడు వినియోగించిన మోటర్ సైకిల్ యజమాని నందకిషోర్ షావును సోమవారం జార్ఖండ్లో అదుపులోకి తీసుకుని ముంబైకి తెచ్చామన్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు సుమారు 36 సీసీటీవి ఫుటేజ్లను పరిశీలించామని, 2,500 మందిని విచారించామని, ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే.. చంద్రభాన్ను కేసు దర్యాప్తు మొదట్లోనే రైల్వే పోలీసులు విచారించి అనుమానం వ్యక్తంచేశారని.. దీనిపై కంజూర్మార్గ్ పోలీసులు స్పదించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించినప్పటికీ.. పోలీస్ కమిషనర్ మారియా దాటవేసేందుకు యత్నించారు.
కట్టుకథ అల్లారు: అనూహ్య తండ్రి
అనూహ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్ అంటూ ముంబై పోలీసులు కట్టు కథ అల్లారని ఆమె తండ్రి సురేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రైల్వేస్టేషన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తితో మోటార్సైకిల్పై వెళ్లినట్లు చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. అనూహ్య వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని.. ఒకటి పది కిలోల బరువు ఉంటుందని, ల్యాప్టాప్ ఉన్న మరో బ్యాగు ఐదు కిలోల బరువు ఉందని.. ఈ రెండు బ్యాగులతో మోటార్సైకిల్పై వెళ్లటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అనూహ్యకు సంబంధించిన బ్యాగు లు, వాటిలోని వస్తువులు, ల్యాప్టాప్ను ముంబై పోలీసులు ఇంతవరకూ చూపలేదన్నారు. రైల్వేస్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలలో అనూహ్య ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ సమయంలో ఆమె ఏ నంబరుతో మాట్లాడిందీ.. ఆ నంబరు ఎవరిదీ.. అనే విషయాలు కూడా పోలీసులు వెల్లడించలేదని పేర్కొన్నారు.
అనూహ్య హంతుకుడి అరెస్ట్
Published Tue, Mar 4 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement
Advertisement