
తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సంచలనం
- భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించిన డీఆర్ఐ
- మెదక్, నల్లగొండల్లో 600కేజీల మత్తుపదార్థాల పట్టివేత
హైదరాబాద్: తెలంగాణ ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దర్యాప్తు జరుగుతుండగానే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ శుక్రవారం ఓ భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు.. రాజధానిని ఆనుకుని ఉన్న మెదక్, నల్లగొండ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపి భారీ ఎత్తున డ్రగ్స్ను పట్టుకున్నారు. సుమారు రూ.7 కోట్లు విలువచేసే 600 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసేకున్నట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో కేంద్ర సంస్థ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
భారీ ప్రయోగశాలల్లో డ్రగ్స్ తయారీ
మెదక్, నల్లగొండ జిల్లాల్లో డీఆర్ఐ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా భారీ ప్రయోగశాలల్లో మత్తుపదార్థాలను తయారుచేస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. దీంతో ఆయా ల్యాబ్లలోని 20 లక్షల విలలువైన రెండు రియాక్టర్లు, ఒక సెంట్రిఫ్యూజ్, ఒక డ్రైయర్ను సీజ్ చేశారు. అయితే, ఈ ల్యాబ్లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ ముఠా స్వయంగా నిర్వహిస్తున్నవా? అనే విషయాలు తెలియాల్సిఉంది. డ్రగ్స్ రవాణా చేస్తోన్న పలు ముఠాలను తెలంగాణ అధికారులు అరెస్ట్ చేసిన దరిమిలా, కేంద్ర సంస్థలు సైతం దూకుడుపెంచడం గమనార్హం.