పాక్ ప్రధానికి సుప్రీంకోర్టు షాక్ | big set back to pak pm nawaz sharif | Sakshi

పాక్ ప్రధానికి సుప్రీంకోర్టు షాక్

Nov 2 2016 2:30 AM | Updated on Mar 23 2019 8:44 PM

పాక్ ప్రధానికి సుప్రీంకోర్టు షాక్ - Sakshi

పాక్ ప్రధానికి సుప్రీంకోర్టు షాక్

పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ

‘పనామా పత్రాల’ స్కాంలో విచారణకు ఆదేశం

 ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. షరీఫ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అన్వర్ జహీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పాక్ సుప్రీం ధర్మాసనం.. షరీఫ్‌పై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది.

ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టుకుండే అధికారాలన్నీ ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఇమ్రాన్ ఖాన్ తాను బుధవారం చేపట్టదలచిన ‘ఇస్లామాబాద్ ముట్టడి’ని విరమించుకున్నట్లు వెల్లడించారు. దాన్ని కృతజ్ఞతా పూర్వక ర్యాలీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. షరీఫ్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించడంతో పాటు ఆందోళన విరమించాలని చెప్పడంతో తాము అందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు కోసం కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై ఇమ్రాన్ పార్టీ పీటీఐ, షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్ కలసి పనిచేయాలని కోర్టు సూచించింది.

ఇందుకోసం​ ఆయన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) భారీగా సన్నాహాలు చేసింది. లక్షలాది మందిని ఇస్లామాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. ఇప్పటికే ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్‌ వివాదం సహా పలు విషయాలలో ఇంటాబయటా ఆరోపణలు ఎదుర్కొంటున్న షరీఫ్‌ మరింత ఇరకాటంలో పడ్డారు. మరోవైపు షరీఫ్‌ను గద్దె దించేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తన ధర్నాను విరమించుకోవడంతో పాక్‌లో ఉద్రిక్తత కొంత సడలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement